PR Minister Video Conference
సచివాలయంలో హరితహారం, ఉపాధిహామీ, మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్లతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష.
జిల్లాల విభజనతో ప్రజలకు పాలన చేరువైందని, అధికారులకు పర్యవేక్షణ సులువైందని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లాల విభజన అనంతరం తొలిసారిగా సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం, ఉపాధిహామి పనులు, వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణం పనుల పురోగతిపై చర్చించారు. పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కలెక్టర్లకు దిశా నిర్ధేశం చేశారు. జిల్లాల విభజన తర్వాత కలెక్టర్లకు కూడా పర్యవేక్షణ సులువుగా మారిందని, పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చేందుకు టీం వర్క్ తో పనిచేయాలన్నారు. కొన్ని జిల్లాల్లో లక్ష్యం మేరకు ఉపాధిహామి పనులు, హరితహారం సాగడం లేదన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా చొరవ చూపి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఉపాధి కూలీ కుటుంబానికి 400 మొక్కల పరిరక్షణ భాద్యత అప్పగించాలని సూచించారు.